ప్రకటించిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి
సూర్యాపేట జిల్లా : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ -2 ప్రాజెక్టుకు దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెడతామన్నారు. ఆదివారం ఇటీవలే మరణించిన రాంరెడ్డి దశదిన ఖర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సంతాప సభలో ప్రసంగించారు రేవంత్ రెడ్డి. రాంరెడ్డి సోదరులు ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేశారన్నారు. పార్టీకి విధేయులుగా ఉన్నారని కొనియాడారు సీఎం.
దామోదర్ రెడ్డి మరణం పార్టీకి, తెలంగాణకు తీరని నష్టం అన్నారు.
తన జీవితాంతం ప్రజలు, పార్టీ కోసం జీవించారని, పార్టీ కార్యకర్తల సంక్షేమం, సంస్థ కోసం తన వ్యక్తిగత సంపద, సౌకర్యాలను త్యాగం చేశారని అన్నారు. ప్రజా ప్రతినిధులు అయిన తర్వాత చాలా మంది ఆస్తులను కూడబెట్టుకుంటే, దామోదర్ రెడ్డి నిస్వార్థతకు ఉదాహరణగా నిలిచారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా , మంత్రిగా పనిచేసిన ఆయన, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వేలాది ఎకరాల పూర్వీకుల భూమిని ప్రజా సేవ కోసం త్యాగం చేశారంటూ ప్రశంసలు కురిపించారు ఎ. రేవంత్ రెడ్డి.
రాజకీయ వేధింపుల సమయంలో దామోదర్ రెడ్డి పార్టీ క్యాడర్కు ఎల్లప్పుడూ అండగా నిలిచారని, నల్గొండ జిల్లాలో పార్టీ జెండాను కాపాడుకున్నారని సీఎం గుర్తు చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ (SRSP) ద్వారా నల్గొండలోని ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు గోదావరి జలాలను తీసుకు రావడానికి ఆయన అవిశ్రాంతంగా పోరాడారని అన్నారు. అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి SRSP స్టేజ్-II పనులను ప్రారంభించేలా చూశారని చెప్పారు. రాజకీయాల్లో ఆయనకు ‘టైగర్ దమ్మన్న’ బిరుదును తెచ్చిపెట్టేలా చేసిందన్నారు. అందుకే ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 ప్రాజెక్టుకు రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించామన్నారు సీఎం.






