గత ఆరు నెలల్లో రూ. 180 కోట్ల విరాళాలు
తిరుమల : తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో ఆయుధ పూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. ముందుగా వేద మంత్రోచ్ఛారణ మధ్య శ్రీ పద్మావతి, శ్రీ వేంకటేశ్వరుని చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాదాల తయారీకి వినియోగించే యంత్రాలు, పాత్రలకు పూజలు చేశారు. అన్నదానం సిబ్బందిని ఈవో సన్మానించారు. అనంతరం సింఘాల్ మీడియాతో మాట్లాడారు. తిరుమలలో 1985లో నిత్యాన్నదాన పథకం ప్రారంభించడం జరిగిందన్నారు. 1994లో శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుగా మార్చారని తెలిపారు ఈవో. ప్రస్తుతం ఈ ట్రస్టులో రూ.2300 కోట్లు నిధులు ఉన్నాయని తెలిపారు. గత ఆరు నెలల్లో రూ.180 కోట్లు విరాళం అందించారని చెప్పారు. తిరుమలకు విచ్చేసే భక్తులందరికీ నాణ్యమైన అన్న ప్రసాదాలను అందిస్తున్నామన్నారు. ఇందుకు కృషి చేస్తున్న అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు.
ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో దేశ వ్యాప్తంగా టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల్లో నిత్యాన్నదానం చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. తిరుమలలో అన్న ప్రసాద కేంద్రంలో మరింత మంది సిబ్బందిని నియమించేందుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. అదే విధంగా దేవాలయాల నిర్మాణంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీవాణి ట్రస్టు ద్వారా 5000 వేల ఆలయాలు నిర్మించేందుకు గత బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దేవాలయాల నిర్మాణానికి అందుబాటులో ఉన్న స్థలం ఆధారంగా రూ.10 లక్షలు, రూ.15 లక్షలు, రూ.20 లక్షలుగా మూడు రకాలుగా కేటాయించాలని నిర్ణయించామని చెప్పారు. ఇందుకు సగుటున ఒక ఆలయానికి రూ.15 లక్షల అంచనా వ్యయంతో మొత్తం రూ.750 కోట్లు కేటాయించేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని తెలిపారు. రాష్ట్ర దేవాదాయశాఖ ద్వారా ఆ స్థలాలను గుర్తించి ఆలయాలు నిర్మించేందుకు చర్యలు తీసుకోనున్నామని చెప్పారు. ఇందుకు మొదట విడతగా రూ.187 కోట్లు విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు రాజేంద్ర, సోమన్నారాయణ, ఈఈ సుబ్రహ్మణ్యం, క్యాటరింగ్ ప్రత్యేకాధికారి శాస్త్రి, ఇతర కార్యాలయ సిబ్బంది, క్యాటరింగ్ సిబ్బంది, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.







