ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటన
విశాఖపట్నం : అభివృద్ది, టెక్నాలజీ పరంగా ఏపీ ప్రపంచంతో పోటీ పడుతోందని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. గురువారం విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్, యూరప్ బిజినెస్ పార్ట్నర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ఈయూ కంపెనీల క్లస్టర్లు ఉన్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్కు రావడానికి వారిని ఒప్పించడానికి మీరు వారికి ఏమి చెబుతారు? వారికి ఇప్పటికే అనుభవం ఉన్న ఇతర రాష్ట్రాలకు కాకుండా, ఏపీని ఎందుకు ఎంచుకోవాలో మీరు ఏ విధంగా భరోసా ఇస్తారు అంటూ ప్రశ్నను సంధించారు.
దీనికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైన రీతిలో సమాధానం చెప్పారు. మీ ఎక్సలెన్సీ, ధన్యవాదాలు. మేము సహకార సమాఖ్య వ్యవస్థలో ఉన్నాం. ఇక్కడ రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడాలి. ఇది నాకు కొత్త కాదు. గతంలో కూడా నేను ఇలాగే పోటీ పడేవాడిని. ఒకప్పుడు, బెంగళూరు దేశానికి ఐటీ రాజధానిగా ఉండేది. అప్పుడు నేను పోటీపడి హైదరాబాద్కు దాన్ని తీసుకు రావడానికి ప్రయత్నించాను. ఇప్పుడు చూడండి, ఆ పోటీ కారణంగానే, హైదరాబాద్ బెంగళూరు కంటే మెరుగైన రేటింగ్ను పొందిందని చెప్పారు.
చంద్రబాబు కొనసాగిస్తూ దావోస్లో కూడా మేము ఇలాగే పోటీ పడేవాళ్ళం. ఒకానొక దశలో, అప్పటి ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ నాతో అన్నారు నేనిక మీతో పోటీ పడలేను. మనం ఇద్దరం కలిసి పని చేద్దాం అని గుర్తు చేశారు . కలిసి పని చేద్దాం దేశాన్ని ముందుకు తీసుకు వెళదామని చెప్పానన్నారు.
నేను నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాను. సంస్కరణలు మొదలుకొని టెక్నాలజీ వరకు ప్రతిదీ చూశానని అన్నారు.






