స్పష్టం చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత
అమరావతి : ఏపీలోని టెక్స్ టైల్స్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. ఏపీ టెక్స్ టైల్స్, అపెరల్, గార్మెంట్స్ పాలసీని 2018-23 గతంలో టీడీపీ సర్కార్ హయాంలోనే చంద్రబాబు నాయుడు తీసుకు వచ్చారని చెప్పారు. తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ పాలసీ కొనసాగింపుపై విధి విధానాలు, మార్గదర్శకాలు రూపొందించక పోవడంతో ఈ పాలసీ బుట్ట దాఖలైందని ఆవేదన చెందారు. మరే నూతన పాలసీ కూడా తీసుకు రాక పోవడంతో, టెక్స్ టైల్స్ రంగం సంక్షోభంలో కూరుకు పోయిందని ఆరోపించారు. 2024 తరవాత మరోసారి సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో పాటు టైక్స్ టైల్స్ రంగం ఊపందుకుందని చెప్పారు ఎస్. సవిత. నూతన టెక్స్ టైల్స్ పాలసీని తీసుకొచ్చారు. అయిదేళ్లలో రూ.10 వేల కోట్లు పెట్టుబడులు, రెండు లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ పాలసీని రూపొందించారని పేర్కొన్నారు.
దీనిలో భాగంగా ఇటీవల విశాఖలో జరిగిన సీఐఐ పార్టనర్ షిప్ సదస్సులో ఎనిమిది ఎంవోయూలతో రూ.4,381.38 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఇందులో భాగంగా అయిదు జిల్లాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు ఎస్. సవిత. టెక్నికల్ టెక్స్టైల్స్, రీసైక్లింగ్, గార్మెంట్స్, సిల్క్, అప్పెరెల్స్ రంగాల్లో ఈ పెట్టుబడులు పెట్టడానికి ఇన్విస్టర్స్ ఆసక్తి చూపారని చెప్పారు. విశాఖపట్నం, చిత్తూరు, గుంటూరు, శ్రీ సత్యసాయి, అనకాపల్లి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి చూపారని తెలిపారు. విశాఖపట్నంలో రూ.4 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఫిన్లాండ్ కు చెందిన ఇన్ఫినిటెడ్ ఫైబర్ సంస్థ ముందుకు వచ్చిందన్నారు. ఈ సంస్థ దుస్తుల రిసైక్లింగ్ లో పెట్టుబడులు పెట్టనుందని తెలిపారు మంత్రి . ఈ పరిశ్రమ ఏర్పాటుతో 360 మందికి ఉపాధి లభించనుంది.
చిత్తూరు జిల్లా గండ్రాజుపల్లిలో బెంగుళూరుకు చెందిన జీనియస్ ఫిల్టర్స్ సంస్థ రూ.120 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. ఈ సంస్థ వల్ల ప్రత్యక్షంగా 250 మందికి ఉపాధి లభించనుంది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో అరవింద్ అపెరల్ పార్క్ రూ.20 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. ఈ సంస్థ ఏర్పాటుతో రెండు వేల ఉద్యోగాలు రానున్నాయి. గుంటూరులో వామిని ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.35 కోట్లు మే పెట్టుబడులు పెట్టనుంది. ఈ సంస్థతో గుంటూరులో రెండు వేల మందికి ఉపాధి లభించనుంది. విశాఖపట్నంలో ఎంవీఆర్ టెక్స్ టైల్స్ రూ.105.38 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడానికి ఆ సంస్థ యాజమాన్యం ముందుకొచ్చింది. ఈ సంస్థ ఏర్పాటుతో 900 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అనకాపల్లిలో బీక్యూ టెక్స్ టైల్స్ యాజమాన్యం రూ.10 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపింది. ఈ సంస్థ వంద మందికి ఉపాధి కల్పించనుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కామధేను సటికా సంస్థ రూ.90 కోట్లతో పెట్టుబడులు పెట్టనుంది. ఈ సంస్థ ఏర్పాటుతో 650 మందికి ఉపాధి లభించనుంది. యూకేకు చెందిన ఐఎస్ఎస్ ఎయిర్ వ్యూ సంస్థ కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ఏ జిల్లాలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయాలో త్వరలో ప్రభుత్వం ప్రకటించనుంది.





