రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత
తాడేపల్లి గూడెం : యువతకు ఉపాధి కల్పనలో ఆంధ్రప్రదేశ్ ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు (ఏపీకేవీఐబీ) కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. స్వయం ఉపాధి యూనిట్ల మంజూరులో స్థానిక ప్రజా ప్రతినిధులు, ఏపీకేవీఐబీ అధికారులు సమన్వయంతో పనిచేసి, అర్హులైన నిరుద్యోగ యువతకు మేలు జరిగేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ఖాదీ క్లస్టర్ల ఏర్పాటుకు కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. తాడేపల్లిలో తన క్యాంపు కార్యాలయంలో ఏపీకేవీఐబీ సీఈవో కె.సింహాచలం, ఇతర అధికారులతో మంత్రి సవిత సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏడాదిలో ఏపీకేవీఐబీ ఆధ్వర్యంలో ఏర్పాటైన యూనిట్ల వివరాలను మంత్రి సవితకు ఏపీకేవీఐబీ సీఈవో సింహాచలం వివరించారు.
2025-26లో కేంద్ర ప్రభుత్వం 1,060 యూనిట్ల ఏర్పాటుకు టార్గెట్ పెట్టగా, లక్ష్యానికి మించి 3,595 యూనిట్లు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఈ యూనిట్ల ఏర్పాటుకు 39.20 కోట్లను మార్జిన్ మనీగా అందించామన్నారు. 3,595 యూనిట్లతో 39,545 మంది ఉపాధి పొందుతున్నారన్నారు. ప్రస్తుతం టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్స్, కొవ్వొత్తుల తయారీ, ఆకులతో కప్పులు, ప్లేట్ల తయారీపై శిక్షణ అందజేస్తున్నామన్నారు. లక్ష్యానికి మించి యూనిట్లు ఏర్పాటు చేయడంపై ఏపీకేవీఐబీ సిబ్బందిని మంత్రి సవిత అభినందించారు. స్వయం ఉపాధి కల్పనలో భాగంగా ఏపీకేవీఐబీ ఆధ్వర్యంలో ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రొగ్రామ్ (పీఎంఈజీపీ) ద్వారా యూనిట్ల ఏర్పాటుపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలన్నారు.





