పరిశీలించిన ఎస్పీ ఎల్ . సుబ్బా రాయుడు
తిరుమల : తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి పర్వదినాలను పురస్కరించుకుని, తిరుపతిలొ భక్తుల రాకపోకలు అధికంగా ఉండనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పి ఎల్. సుబ్బరాయుడు సోమవారం వివిధ ప్రాంతాల్లో అమలు చేస్తున్న భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రగిరి శ్రీవారి మెట్టు, అప్పలాయగుంట, అలిపిరి పాదాలు తదితర కీలక ప్రాంతాలను సందర్శించారు. భక్తుల సౌకర్యాలు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు విధులు, రద్దీ నిర్వహణ చర్యలను సమీక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చిన సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్, సంబంధిత సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తులకు అసౌకర్యం లేదా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఎస్పీ. అన్ని కీలక ప్రాంతాలను కమాండ్ & కంట్రోల్ రూమ్కు సీసీ కెమెరాల ద్వారా అనుసంధానం చేయడం జరిగిందన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ, ఏ చిన్న సమాచారం ఉన్నా వెంటనే కమాండ్ కంట్రోల్కు తెలియ చేయాలని స్పష్టం చేశారు. పోలీస్ శాఖ పూర్తి స్థాయిలొ పని చేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాల సందర్భంగా తిరుపతి జిల్లా పోలీస్ శాఖ అన్ని విభాగాల సమన్వయంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టి, భక్తుల భద్రత, సౌకర్యాలు, శాంతి భద్రతల పరిరక్షణకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.







