నిప్పులు చెరిగిన కల్వకుంట్ల కవిత
నల్లగొండ జిల్లా : కాంగ్రెస్ ప్రజా పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించారు. తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాలకు నీళ్లు ఇచ్చే ఎస్సార్ఎస్పీ స్టేజీ -2 కాల్వతో పాటు వెలుగుపల్లి గ్రామంలోని రుద్రమ చెరువును పరిశీలించారు. అనంతరం కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పంట కాల్వల మెయింటెనెన్స్ సరిగా లేదన్నారు. కాల్వల్లో కంప చెట్లు పెరిగాయని మండిపడ్డారు. నిర్వహణ సరిగా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటి మెయింటెనెన్స్ కోసం గత బీఆర్ఎస్ సర్కార్ కానీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గానీ ఒక్కపైసా విడుదల చేయలేదని మండిపడ్డారు.
ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగానికి కనీసం నిధులు ఇవ్వటం లేదన్నారు కల్వకుంట్ల కవిత .కోదాడ వరకు నీళ్లు ఇచ్చే డిస్ట్రిబ్యూటరీ కాల్వ 70 కిలోమీటర్లు ఉంటుందన్నారు. ఈ కాల్వను సరిగా మెయింటెన్ చేయటం లేదని ధ్వజమెత్తారు . రుద్రమ దేవి చెరువును కూడా పరిశీలించాం. 700 ఎకరాల్లోని ఈ చెరువుకు గోదావరి నీళ్లు రావాల్సి ఉందన్నారు. కానీ కిలోమీటర్ కు పైగా డిస్ట్రిబ్యూటరీ కాల్వ తవ్వక పోవటం కారణంగా గోదావరి నీళ్లు రావటం లేదన్నారు. గత బీఆర్ఎస్ పెద్దలు ఈ చెరువును 5 టీఎంసీల రిజర్వాయర్ చేస్తామని రెండు ఎన్నికల్లో మాట ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ చెరువును లక్నవరం మాదిరిగా టూరిస్ట్ ప్లేస్ చేస్తామని మాట ఇచ్చిందని గుర్తు చేశారు కవిత.






