దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అశ్వమిత్ గౌతం
ఉత్తర ప్రదేశ్ : ఎవరైనా పద్నాలుగు ఏళ్లు వస్తే ఏం చేస్తారు..? సోషల్ మీడియాలో గడిపేందుకు ఇష్ట పడతారు. సినిమాలు, షికార్లు, లవ్ ఎఫైర్లు, కార్లు, బైక్ లను ఇష్ట పడతారు. ఆపై రీల్స్ చూసుకుంటూ విలువైన కాలాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కానీ కేవలం 14 ఏళ్ల వయసు ఉన్న ఈ కుర్రాడి పేరు అశ్వమిత్ గౌతం (Ashwamit Gautam ). వయస్సు 14 సంవత్సరాలు. ఈ కుర్రాడి మీద ఉత్తరప్రదేశ్ ప్రభుత్వపు పోలీసులు కేసు ఫైల్ చేశారు. నిజానికి ఈ కుర్రాడి తెలివితేటలతో మిగతా పిల్లలు అదే ప్రభుత్వం చేత అవార్డులూ, రివార్డులూ అందుకొంటోంటే, ఈ కుర్రాడు మాత్రం కేసులు ఎదుర్కొంటున్నాడు. అలాగని వీడేమీ మోసాలూ, నేరాలూ చేయలేదు, కనీసం ఒక రాయి కూడా ఎవరి మీదా విసరలేదు, జస్ట్ ఒక యూట్యూబ్ చానెల్ నడుపుతున్నాడంతే.
అలాగని చానెల్లో బూతులూ, విద్వేషాలూ, అబద్దాలూ మన వాళ్లలాగా వండి వార్చడంలేదు. కేవలం సత్యం చెబుతున్నాడు. అవును సత్యమే చెబుతున్నాడు అయితే ఆ సత్యం అబ్దుల్కలాం, అంబేద్కర్, భగత్సింగ్ మీదుగా వచ్చింది కావడమే విశేషం. పైగా కింది కులాలనుండి వచ్చిన నేపధ్యం. విపరీతంగా చదవడం వల్ల పిన్న వయసునుండే చెప్పే విషయమ్మీద తిరుగులేని సాధికారికత. నిజాయితీగా, నిర్భయంగా ప్రశ్నించడమే . ఇప్పుడా ఆ కుర్రాడికి విపరీతాదరణ రావడానికి కారణమైంది. అది సహజంగా FIR నమోదుకు దారి తీసింది.
దేశం యావత్తూ ఈ కుర్రాడి పట్ల సంఘీభావంగా చాలామంది మద్దతు పలుకుతున్నారు. ఇంతపెద్ద దేశం, ఇన్ని వ్యవస్థలు 14ఏళ్ల కుర్రాడికి ఎందుకు భయపడుతున్నాయని ప్రశ్నిస్తున్నారు. సోకాల్డ్ ఇన్ఫ్లుయన్సర్లూ, యూట్యూబర్లూ, న్యూస్ చానెళ్లూ ఈ కుర్రాడిని చూసి సిగ్గుపడాలని అంటున్నారు.








