సంచలన ప్రకటన చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు అప్ డేట్ ఇచ్చారు. కేవలం రెండు మూడు రోజుల్లోనే పురపాలిక సంఘం ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. వచ్చే నెల ఫిబ్రవరి లోనే పోలింగ్ కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా 76వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ సర్కార్ కు వచ్చిన ఢోకా ఏమీ లేదన్నారు. కొందరు కావాలని బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత తమ ప్రజా ప్రభుత్వానికే దక్కుతుందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం మాకు గేమ్ ఛేంజర్ అని పేర్కొన్నారు. మరో మూడేళ్లు స్థిరమైన ప్రభుత్వం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు నీటి పారుదల శాఖ మంత్రి. అయితే ప్రస్తుతం జరగబోయే మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి, సర్కార్ కు సవాల్ తో కూడుకుని ఉన్నదన్నారు. మళ్లీ రాబోయేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనంటూ ధీమా వ్యక్తం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.






