ఆయనను జనం నమ్మడం లేదన్న మంత్రి
సత్యసాయి జిల్లా : మాజీ సీఎం జగన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. ఆమె సత్యసాయి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలతో జగన్ అలజడులు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధిలో దూసుకు పోతున్నారని చెప్పారు ఎస్. సవిత. కల్తీ గురించి జగన్ మాట్లాడడం విడ్డూరమని, ఏ విషయంలో ఆయన కల్తీ చేయలేదో చెప్పాలని నిలదీశారు. జగన్ హయామంతా కల్తీలేనని చివరికి తిరుపతి ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారని విమర్శించారు. మద్యం కల్తీ చేసి అమామయకులు ప్రాణాలు పొట్టనబెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు .
కేవలం జగన్ రెడ్డి తన ఉనికి కోసం, చిల్లర రాజకీయాల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టి శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ పాదయాత్రకు వస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. వైసీపీకి ప్రజలు ఏనాడో పాడె కట్టేసి శవయాత్ర జరిపించేశారన్నారు. బడుగు బలహీన వర్గాల మనోభావాలతో ఆడుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, ఆయన పాదయాత్ర కాదు, పొర్లు దండాలు పెట్టినా అధికారంలోకి రాలేరని స్పష్టం చేశారు. గత 19 నెలల్లో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ప్రజలకు స్పష్టంగా తెలుసని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అపర భగీరథుడని కొనియాడారు.






