కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని అన్ని చిన్న పెద్ద రిజర్వాయర్లలో 1312 టీఎంసీల మేర నిల్వ చేసుకునే అవకాశం ఉందని, ప్రస్తుతం 793 టీఎంసీల మేర నీటితో రిజర్వాయర్లు కళకళ లాడుతున్నాయని సీఎం అన్నారు. అందుకే పంట సీజన్ ను ముందుకు జరిపేలా మే 15 నాటికే నారుమళ్లకు నీరు ఇచ్చేలా ప్రణాళిక చేస్తున్నామన్నారు. దీనికి అనుగుణంగా స్థానిక ప్రజా ప్రతినిధులంతా రైతులను చైతన్యవంతులను చేయాలని స్పష్టం చేశారు. 16 లక్షల హెక్టార్ల మైక్రో ఇరిగేషన్ తో దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ ఉందని ముఖ్యమంత్రి వివరించారు. నీటి నిర్వహణ నుంచి పొదుపు చేసే వరకూ వివిధ కార్యక్రమాలను రైతులతో కూడిన నీటి వినియోగదారుల సంఘాలకు అప్పగిస్తున్నామని సీఎం తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భజలాల పెంపునకు కూడా పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని చెప్పారు చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సగటున 7.3 మీటర్ల లోతున భూగర్భజలాలు ఉన్నాయని రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న జల సంరక్షణా చర్యల కారణంగా సగటున 6 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయన్నారు. తద్వారా చాలా ప్రాంతాల్లో విద్యుత్ మోటార్ల ద్వారా విద్యుత్ వినియోగం కూడా తగ్గిందని.. రూ 91 కోట్ల మేర విద్యుత్ కూడా ఆదా అయ్యిందని వివరించారు. నదులు పారే చివరి రాష్ట్రంగా ఏపీకి ఉండే నీటి భద్రత మరే రాష్ట్రానికీ లేదన్నారు. భూమినే జలాశయంగా మార్చి నీటి సంరక్షణ చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్ పెంచాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని.. తిరుమలలో 89 శాతం మేర పచ్చదనం ఉందన్నారు.





