స్పష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : సాంకేతిక విద్యా విధానంలో అనుగుణమైన మార్పులను తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2026-2027 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అమలు చేయాలని అన్నారు. బ్రేక్ఫాస్ట్తో పాటు ప్రతి విద్యార్థికి పాలు అందజేయాలి. పాలను విజయా డెయిరీ నుంచి సేకరించాలి. విద్యార్థులకు ఎన్ని క్యాలరీలు అందజేస్తున్నామనేది తెలుసుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని స్పష్టం చేశారు సీఎం. పాఠశాల విద్యార్థులకు స్కూల్ యూనిఫాం, పుస్తకాలతో పాటు ఈ ఏడాది నుంచి కిట్ అందజేయాలి. ఆ కిట్ లో స్కూల్ బ్యాగ్, పెన్నులు, పెన్సిళ్లు, షార్పనర్లు, రంగుల పెన్సిళ్లు, జామెట్రీ బాక్సులు, డిక్షనరీ, బూట్లు, సాక్సులు ఉండాలి. ఇందుకు సంబంధించిన మొత్తాన్ని బడ్జెట్లో పొందుపర్చాలని అన్నారు సీఎం.
విద్యా రంగంపై సమీక్ష చేపట్టారు . పాలిటెక్నిక్ కళాశాలలు, ఏటీసీల్లో ఏఐ ఆధారిత కోర్సులు వెంటనే ప్రారంభించాలన్నారు. కాలం చెల్లిన కోర్సులను తొలగించాలని ఆదేశించారు. పాలిటెక్నిక్, ఏటీసీల్లో కోర్సులు పూర్తి చేసిన వారికి వెంటనే వివిధ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు లభించేలా చూడాలని అన్నారు సీఎం. రాష్ట్రంలోని అన్ని విశ్వ విద్యాలయాలకు నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు కేటాయించిన నేపథ్యంలో, మిగతా వర్సిటీలకు ఎంత నిధులు అవసరమనే దానిపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు.






