శాసన సభలో చంద్రబాబు ప్రకటన
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. అన్ని రంగాలలో వెనుకబాటుకు గురైన రాయలసీమ ప్రాంతాన్ని మరింత అభివృద్ది చేసేందుకు నడుం బిగించామని అన్నారు. ఇందులో భాగంగా తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి అత్యధిక నిధులను కేటాయించడం జరిగిందన్నారు. ప్రైవేటు రంగంలో మరో 70 వేల కోట్లతో మొత్తం లక్ష కోట్ల మేర పెట్టుబడులతో రాయలసీమను ఉద్యాన హబ్ గా తయారు చేస్తామని శాసనసభ సాక్షిగా ప్రకటించారు సీఎం. ఏలూరు వద్ద ప్రపంచంలోనే అత్యంత పెద్ద కోకో సిటీ ఏర్పాటు చేస్తాం అన్నారు. రూ.1.50 కే యూనిట్ విద్యుత్ ఇచ్చి అక్వా రంగాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
ఏపీ ఆక్వా కల్చర్ హబ్గా తయారు అవుతుందని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. ఈసారి కొంతమేర వర్షపాతం తగ్గే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయని అన్నారు. నీటి భద్రతపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టామని పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో సమర్ధ నీటి నిర్వహణ ద్వారా 6.67 మీటర్లకు భూగర్భ జలాలు పెరిగాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో సగటున 7.31 మీటర్ల మేర భూగర్భ జలాలు ఉన్నాయని అన్నారు. భూగర్భ జలాలు పెరిగిన కారణంగా రూ.95 కోట్ల మేర విద్యుత్ ఆదా అయ్యిందని చెప్పారు. 20 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు కూడా పెరిగాయని తెలిపారు. రూ.1634 కోట్ల మేర జీఎస్డీపీ కూడా పెరిగిందన్నారు. సాగునీటి సంఘాలు కూడా ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలని పిలుపు ఇచ్చారు సీఎం.






