సీఎం సీపీఆర్వో డా.మల్సూర్ హామీ
హైదరాబాద్ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పిన ప్రకారం డెస్క్ జర్నలిస్టులకు గతంలో కంటే ఎక్కువగానే అక్రిడిటేషన్ కార్డులు వస్తాయని సీఎం సీపీఆర్వో మల్సూర్ తెలిపారు. సీఎం సీపీఆర్వోను డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అఫ్ తెలంగాణ (డీజే ఎఫ్ టీ) రాష్ట్ర నాయకులు కలిసి డెస్క్ జర్నలిస్టుల అక్రిడిటేషన్లలో నెలకొన్న గందరగోళంపై వినతిపత్రం సమర్పించారు. డీజేఎఫ్టీ ఆధ్వర్యంలో డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలనే డిమాండ్ తో సెక్రటేరియేట్లో సీఎం సీపీఆర్వో డా.మల్సూర్ ను కలిసి సమస్యను వివరించారు. ప్రతి జిల్లాకు ఎంతమంది సబ్ ఎడిటర్లు పని చేస్తున్నారు, వారికి గతంలో ఎన్ని కార్డులు ఇచ్చారు. ఇప్పుడు ఎన్ని ఇస్తున్నారు..జిల్లా డెస్కులు , ఎడిషన్ సెంటర్ల వివరాలు అన్నీ ఈ సందర్భంగా సీఎం సీపీఆర్వో మల్సూర్ వివరించారు.
అన్ని విషయాలు ఓపికగా విన్న సీపీఆర్వో డెస్క్ జర్నలిస్టుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించారు. గతంలో కంటే కార్డులు తగ్గించవద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టంగా అధికారులకు చెప్పారని అన్నారు. గతంలో డెస్క్ జర్నలిస్టులకు ఎన్ని అక్రెడిటేషన్లు ఇచ్చారనేది లిస్ట్ తెప్పించి చూస్తానని, ఆ మేరకు కార్డులు వచ్చేలా సమాచార శాఖ మంత్రి, కమిషనర్ తో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అక్రెడిటేషన్ల విషయంలో జర్నలిస్టులెవరూ ఆందోళన చెందవద్దని సీఎం పీఆర్వో సూచించారు. సీపీఆర్వోను కలిసిన వారిలో డీజే ఎఫ్ టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మస్తాన్, రాష్ట్ర నాయకులు దొడ్డి శేఖర్ , ఓగేటి కిరణ్ కుమార్, వినోద్ రావు, భాస్కర్ తదితరులు ఉన్నారు.






