నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ : పాలనా పరంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంకా పట్టు పెంచుకోలేదన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. పాలన చేతకాక ఎడా పెడా ఐఏఎస్ లు, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ పోతున్నాడని ఆరోపించారు. దీని వల్ల పాలన కుంటు పడుతుందన్నారు. సంక్షేమ పథకాల అమలును గాలికి వదిలి వేశాడని అన్నారు. ఒక్క రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు నలుగురు కలెక్టర్లను మార్చాడని మండిపడ్డారు. ఇక పంచాయతీ రాజ్ కమిషనర్ లుగా నలుగురు మారారని, ఇది కూడా పేదలకు అందుబాటులో ఉండే కీలకమైన శాఖ అని పేర్కొన్నారు హరీశ్ రావు. ఇప్పటి వరకు 145 మంది ఐఎస్ఐ లను బదిలీలు చేశారు, 25 మంది కలెక్టర్లు బదిలీలు జరిగాయని తెలిపారు.
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో 5 సార్లు అధికారాలు బదిలీలు కావడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు హరీశ్ రావు. ఐటీ శాఖలో ఇదే పరిస్థితి నెలకొందని, ఇక మైనింగ్ శాఖ రాష్ట్రానికి ఆదాయం ఇచ్చే శాఖ. ఇందులో ఇప్పటి వరకు 5 డైరెక్టర్లు మారారని అన్నారు. జీహెచ్ఎంసీ అంటేనే రాష్ట్రానికి గుండెకాయ అలాంటి జీహెచ్ఎంసీకి ఆరు నెలలు కాకుండానే మార్చుకుంటూ పోయారని ఇలాగైతే పేదలు, ప్రజలకు సేవలు ఎలా అందిస్తారంటూ ప్రశ్నించారు హరీశ్ రావు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులు తేవడంలో విఫలం అవుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని ఆయా శాఖల సెక్రటరీలతో పరిచయం అయ్యేసరికి వారిని బదిలీ చేస్తున్నారని భగ్గుమన్నారు.





