రాజ్యసభ సాక్షిగా ఎంపీ రాఘవ్ చద్దా డిమాండ్
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన కీలకమైన మహిళలు , బాలికలు, యువతులు నిత్యం ఎదుర్కొనే నెలసరి సమస్య గురించి ప్రస్తావించారు. ఈ దేశానికి స్వేచ్ఛ లభించి 75 ఏళ్లవుతున్నా ఇంకా రుతు క్రమం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రధానంగా
శానిటరీ ప్యాడ్లు, నీరు, గోప్యత లేకపోవడం వల్ల ఒక అమ్మాయి పాఠశాలకు వెళ్లకపోతే, అది ఆమె వ్యక్తిగత సమస్య కాదు. అది మన సమిష్టి వైఫల్యం అని కుండ బద్దలు కొట్టారు రాఘవ్ చద్దా. మనం మద్యం సిగరెట్లు బహిరంగంగా అమ్ముడవుతున్న దేశంలో నివసిస్తున్నామని పేర్కొన్నారు, కానీ శానిటరీ ప్యాడ్లను ఇప్పటికీ వార్తా పత్రికలలో చుట్టి దాచి పెట్టాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ.
ఎక్కడో ఒకచోట, సమాజం ఒక జీవ సంబంధమైన వాస్తవాన్ని సామాజిక నిషిద్ధంగా మార్చిందన్నారు. సైన్స్కు సంబంధించిన ఒక విషయాన్ని నిశ్శబ్దానికి సంబంధించిన విషయంగా మార్చడం దారుణమన్నారు రాఘవ్ చద్దా. భారతదేశంలోని 35 కోట్లకు పైగా మహిళలు, బాలికలను ప్రభావితం చేస్తున్నందున ఈ సమస్యను పార్లమెంట్ సాక్షిగా ప్రస్తావించడం జరిగిందన్నారు. సిగ్గు, నిశ్శబ్దాన్ని ఎదుర్కొంటుంటే ఒక దేశం తనను తాను నిజంగా ప్రగతిశీలమని చెప్పుకోలేదన్నారు.
పురోగతికి నిజమైన పరీక్ష సులభం. భారతదేశంలోని ప్రతి అమ్మాయి పాఠశాలకు వెళ్లి, గౌరవంగా జీవించి, కళంకం లేకుండా దీని గురించి మాట్లాడగలిగిన రోజు, మన సమాజం నిజంగా ముందుకు సాగిందని మనం చెప్పగల రోజు అవుతుందన్నారు రాఘవ్ చద్దా.





