శాసన సభలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు
హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు సీఎం ఎ రేవంత్ రెడ్డి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా కోట్లు విలువ చేసే భూములను అక్రమంగా కబ్జాకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఆదివారం శాసన సభ వేదికగా సీఎం సీరియస్ కామెంట్స్ చేయడం కలకలం రేపింది. ఆయన తాజాగా హరీష్ రావు అక్రమాల , భూ కబ్జాల చిట్టా విప్పారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద రెడీగా ఉన్నాయని చెప్పారు సీఎం. దమ్ముంటే విచారణకు సిద్దం కావాలని హరీష్ రావుకు సవాల్ విసిరారు .
ఇందుకు సంబంధించి హరీశ్ రావు బాగోతాన్ని బట్ట బయలు చేశారు సీఎం. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలంలో మాజీ మంత్రి హరీశ్రావు తన కుటుంబ సభ్యులతో కలిసి వందల ఎకరాల భూమిని అక్రమంగా దక్కించుకున్నారని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు. ధరణి పోర్టల్ను అడ్డం పెట్టుకుని, ప్రైవేటు కంపెనీలను బెదిరించి ఈ భూములను బదలాయించు కున్నారని పేర్కొన్నారు. ఈ భూకబ్జాపై హౌస్ కమిటీ వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. హరీశ్రావు… నిజాయితీప రుడైతే అందుకు సహకరించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.





