తిరుపతిలో పీ4 వార్షికోత్సవంలో పాల్గొననున్న సీఎం
అమరావతి : ప్రతీ ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తోన్న ప్రజా ప్రభుత్వం మరోసారి సామూహిక గృహ ప్రవేశాల ద్వారా పేదలకు ఇళ్ల పంపిణీ చేపట్టనుంది. రెండో విడత ఇళ్ల పంపిణీలో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 2.5 లక్షల గృహ ప్రవేశాలను ఘనంగా నిర్వహించింది. తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గంలో సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు.
కూటమి అధికారంలోకి వచ్చాక ఈ 21 నెలలో రెండోసారి ప్రభుత్వం ఇళ్ల పంపిణీ చేస్తోంది. గతేడాది నవంబర్లో రాయచోటి నుంచి 3 లక్షల ఇళ్లను రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు అప్పగించింది. రెండో విడతలో భాగంగా సూళ్లూరుపేట నియోజకవర్గం, నాయుడపేట మండలం, పుదూరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్ష టిడ్కో ఇళ్లతో పాటు మరో 1.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు ముఖ్యమంత్రి పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమం అనంతరం పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన పీ4 కార్యక్రమం మొదలుపెట్టి ఏడాదవుతున్న సందర్భంగా తిరుపతిలో నిర్వహించే వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.





