కేంద్రానికి నిధులు ఇవ్వాలని కోరిన మంత్రి దుర్గేష్
న్యూఢిల్లీ : ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పర్యాటక , సాంస్కృతిక రంగాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా సాంస్కృతిక పరంగా మరింత తోడ్పాటు అందించేందుకు కేంద్రం నిధులు ఇవ్వాలని కోరారు. ఆయన ఢిల్లీలో పర్యటించారు. పలువురు కేంద్ర మంత్రులను కలిశారు.
1936-1974 మధ్య ఎనిమిది సంపుటాలుగా వెలువడిన ‘సూర్యరాయాంధ్ర నిఘంటువు’ తెలుగు భాషా చరిత్రలో ఒక అద్భుతమైన గ్రంథమని, ఇందులో 1.1 లక్షలకు పైగా పదాలు ఉన్నాయని, పాత కాలపు ముద్రణ పద్ధతుల వల్ల ప్రస్తుతం ఇది చదువరులకు కష్టంగా మారిందని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన మేరకు తెలుగు భాషా వారసత్వ సంపద అయిన ‘సూర్యరాయ నిఘంటువు’ను ఆధునిక సాంకేతికతతో, కొత్త ఫాంట్లతో తో పునర్ముద్రించాలని కేంద్ర మంత్రితో చర్చించగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇప్పటికే సూత్రప్రాయ అంగీకారం వచ్చినప్పటికీ కార్యరూపం తీసుకొచ్చేందుకు మంత్రి దుర్గేష్ తీసుకున్న చర్యలు సఫలీకృతమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ పద్య నాటకం, సురభి థియేటర్, వీధి నాటకం వంటి గొప్ప రంగస్థల కళలకు నిలయమని, జాతీయ స్థాయిలో గుర్తింపు, సరైన శిక్షణ సంస్థలు లేక ఈ కళలు సవాళ్లను ఎదుర్కుంటున్నాయని వివరించారు. రాజమండ్రిలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఏర్పాటును త్వరితగతిన ఆమోదించాలని కోరారు. ఇప్పటికే కేంద్ర సాంస్కృతిక శాఖ సంయుక్త కార్యదర్శి, ఎన్ ఎస్ డీ అధికారులు రాజమండ్రిలో స్థల పరిశీలన పూర్తి చేసిన విషయాన్ని మంత్రి దుర్గేష్ గుర్తు చేశారు. దీనిని త్వరితగతిన పట్టాలెక్కిస్తామని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హామీ ఇచ్చారని తెలిపారు. అదే విధంగా శీలాభీడే కమిటీ సిఫార్సు మేరకు అమరావతిలో ఇంటిగ్రేటెడ్ ఎక్స్పీరియన్స్, ఇంటర్ ప్రిటేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (పర్యాటక భవన్) ఏర్పాటుకు రూ.100 కోట్ల ఆర్థిక సహాయాన్ని కోరారు. అమరావతిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ (NIH) ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.





