పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
హైదరాబాద్ : విద్యార్థి దశ నుంచే పర్యావరణ పరిరక్షణ పై అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. అప్పుడే మెరుగైన జీవితాన్ని గడపగలమని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, సుస్థిరమైన వాతావరణాన్ని అందించాలంటే విద్యార్థుల్లోనే బాధ్యతాభావాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ప్రతి విద్యాసంస్థలో ఎన్విరాన్మెంట్ క్లబ్ల ఏర్పాటు కీలకమని సూచించారు. హైటెక్స్లో సీబీఐటీ కళాశాల నిర్వహించిన “మోడల్ యునైటెడ్ నేషన్స్ 2026” కార్యక్రమంలో శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి హైడ్రా కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న కల్చరల్ క్లబ్లు, యాంటీ ర్యాగింగ్ క్లబ్లు, ప్లేస్మెంట్ క్లబ్లు, స్పోర్ట్స్ క్లబ్లు, అంతర్జాతీయ పరిణామాల అవగాహన క్లబ్ల మాదిరిగానే పర్యావరణ క్లబ్లను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.
దీని వల్ల విద్యార్థులు ప్రకృతి పరిరక్షణలో చురుకుగా పాల్గొనే అవకాశాలుంటాయని చెప్పారు. ఈ క్లబ్ల ద్వారా చెట్లు నాటడం, జల వనరుల పరిరక్షణ, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పరిశుభ్రత కార్యక్రమాలు వంటి అంశాలపై విద్యార్థుల్లో చైతన్యం తీసుకు రావచ్చన్నారు. ప్రతి విద్యార్థి తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తే సమాజంలో సానుకూల మార్పు తప్పకుండా కనిపిస్తుందని అన్నారు. హైడ్రా సంస్థ చేపడుతున్న చెరువుల పునరుద్ధరణ, ప్రకృతి వనరుల పరిరక్షణలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని సూచించారు. విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు విద్యా సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ అనేది ఒక్క ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత అని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు.





