స్పష్టం చేసిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి : ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు అమరావతి సచివాలయంలో సీఆర్డీఏ, విద్యుత్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సహచర మంత్రి పొంగూరు నారాయణతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజధాని పరిధిలో చేపట్టిన విద్యుత్ శాఖ పనులపై కూలంకుషంగా చర్చించారు. రాజధాని మాస్టర్ ప్లాన్ లో ఎలాంటి మార్పులు లేకుండా విద్యుత్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. అలాగే రాజధానిలో హైటెన్షన్ లైన్లు మార్పిడిపై అధికారులు సమన్వయం చేసుకుని పూర్తి చేయాలని సూచించారు.
ముఖ్యంగా న్యాయమూర్తులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అఖిల భారత సర్వీసు అధికారుల నివాసాలకు విద్యుత్ సరఫరాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశామన్నారు గొట్టిపాటి రవికుమార్, పొంగూరు నారాయణ. ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధత వచ్చిన నేపథ్యంలో పనులన్నీ వేగవంతంగా పూర్తి చేయాలని సీఆర్డీఏ, విద్యుత్ శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో సీఆర్డీఏ కమిషనర్ విజయ రామరాజు , సీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి , పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.





