డీకే శివకుమార్ కు సీఎం అయ్యేందుకు మార్గం సుగమం
బెంగళూరు : కర్ణాటక గవర్నర్ సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదించారు . నిన్న గవర్నర్ అందుబాటులో లేక పోవడంతో సిద్దరామయ్య తన అనుచరులతో కలిసి గవర్నర్ కార్యాలయంలో కార్యదర్శి ప్రభు శంకర్ కి తన రాజీనామా లేఖ సమర్పించారు. మధ్యప్రదేశ్ పర్యటన ముగించుకుని శుక్రవారం తిరిగి వచ్చిన గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య సమర్పించిన రాజీనామాను ఆమోదించారు. నేను కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను. దయచేసి దీనిని ఆమోదించండి అని సిద్దరామయ్య తన లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తన రాజీనామాను ఆమోదిస్తూ గవర్నర్ ఓ ప్రకటన జారీ చేశారు.
సిద్ధరామయ్య సమర్పించిన రాజీనామా ఆమోదించ బడిందని, తక్షణమే ఆయన నేతృత్వంలోని మంత్రి మండలి రద్దయిందని పేర్కొన్నారు. అయితే, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తయ్యే వరకు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగుతారని గవర్నర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు, తన రాజీనామా “స్వచ్ఛందమైనది” అని సిద్ధరామయ్య ప్రకటించారు. ఇప్పటి వరకు మూడు ఏళ్ల పాటు సీఎంగా కొనసాగారు సిద్దరామయ్య. మిగిలిన రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసేందుకు ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ సిద్దమయ్యారు.







