కీలక ప్రకటన చేసిన ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ
అమరావతి : ఏపీని వడగాల్పులు వెంటాడుతున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో సాధారణ వర్షపాతం కురిసే అవకాశం ఉందన్నారు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్. ఇక రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ఆదివారం పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు రేపు శ్రీకాకుళం జిల్లాలో 12 మండలాలు, విజయనగరం 22, మన్యం 12, అల్లూరి1, పోలవరం 2, విశాఖ 1,కాకినాడ 8 మొత్తంగా 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 104 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు ఎండీ ప్రఖర్ జైన్. అవసరమైతే తప్పా ప్రజలకు బయటకు రావద్దని, ఒకవేళ పనుల నిమిత్తం వస్తే మజ్జిగ, నిమ్మ రసం తాగాలని సూచించారు.






