హైదరాబాద్ : తెలంగాణలోని గాంధీ మెడికల్ కాలేజీ అరుదైన ఘనత సాధించింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో IIRF ర్యాంకు సాధించింది. దీంతో గాంధీ మెడికల్ కాలేజ్ అధ్యాపక బృందం సంబరాలలో మునిగి పోయారు. ర్యాంకింగ్స్లో గాంధీ మెడికల్ కాలేజ్ జాతీయ స్థాయిలో 43వ స్థానాన్ని పొందింది. తెలంగాణ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. అధ్యాపక బృందం ప్రకారం ప్రిన్సిపాల్ నాయకత్వంలో వైద్య విద్య, రోగుల సంరక్షణ, విద్యాపరమైన అంశాలు, పరిశోధన , సమష్టి కృషిలో గాంధీ మెడికల్ కాలేజ్ కుటుంబం చేసిన ఉమ్మడి ప్రయత్నాలకు ఈ ర్యాంకింగ్ నిదర్శనంగా నిలిచింది. రాబోయే సంవత్సరాల్లో జాతీయ ర్యాంకింగ్ను మరింత మెరుగు పరచుకునే దిశగా కృషిని కొనసాగించేందుకు ఈ గుర్తింపు సంస్థకు ప్రోత్సాహాన్నిస్తుందని అధ్యాపకులు ,విద్యార్థులు పేర్కొన్నారు. తెలంగాణ ర్యాంకింగ్స్లో హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజ్ 52వ స్థానంలో, వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజ్ 60వ స్థానంలో నిలిచాయి.
ఆదిలాబాద్లోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 139వ స్థానాన్ని పొందింది. జాతీయ స్థాయిలో, ప్రభుత్వ వైద్య సంస్థలలో ఢిల్లీలోని ఎయిమ్స్ ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. గాంధీ మెడికల్ కాలేజ్ సాధించిన జాతీయ స్థాయి 43వ ర్యాంకు , తెలంగాణలో ప్రథమ స్థానం ఆ సంస్థకు ఒక మైలురాయి అని అధ్యాపకులు అభివర్ణించారు; ఇది విద్యార్థులు , అధ్యాపకులను మరింత ఉన్నత ర్యాంకుల కోసం లక్ష్యంగా పెట్టుకునేలా ప్రేరేపిస్తుందని వారు అన్నారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని కళాశాల అధ్యాపకులు, వైద్యులు , విద్యార్థులు ఒక అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ప్రిన్సిపాల్ డాక్టర్ కె. ఇందిరకు శుభాకాంక్షలు తెలిపారు. అధ్యాపకులు ప్రిన్సిపాల్ను సన్మానించారు.





