న్యూఢిల్లీ : లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆయన ప్రధాని మోదీ, ఆయన పరివారాన్ని ఏకి పారేశారు. ఇదే క్రమంలో బీజేపీని, దాని అనుబంధ సంస్థలను , నాయకులను తీవ్రంగా తప్పు పట్టారు. మన చరిత్ర, తత్వశాస్త్రం గురించి ఏమీ తెలియని జోకర్లకు, విదూషకులకు భారతదేశం భయపడ కూడదన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యంతో పోరాడుతున్నప్పుడు భయం కలగడం సహజమే కావచ్చు, కానీ ఈ రోజు మన చరిత్ర, తత్వశాస్త్రం గురించి ఏమీ తెలియని శక్తులకు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
దేశం విభజనకు లొంగకుండా ధైర్యంగా నిలబడాలని ఆయన స్పష్టం చేశారు .ధైర్యంగా నిలబడాలని ఆయన నొక్కి చెప్పారు. భారత రాజ్యాంగ స్పూర్తికి భంగం కలిగిస్తూ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న వారిని దేశం , ప్రజలు క్షమించరని అన్నారు రాహుల్ గాంధీ. గత 2014 నుంచి నేటి దాకా దేశంలో ఏ ఒక్క వ్యవస్థను సరిగా పని చేయనివ్వడం లేదన్నారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు రాహుల్ గాంధీ. ప్రజలంతా అన్నీ గమనిస్తున్నారని, అందుకే జెన్ జి ఉద్యమం బయటకు వచ్చిందన్నారు. ఇకనైనా మోదీ, షా మారాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదన్నారు.






