హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఉన్న ప్రముఖ టెక్ కంపెనీ టెక్ మహీంద్రా కంపెనీ ముందు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న భావన ఆందోళనకు దిగారు. తనను అకారణంగా తొలగించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం తనను కక్ష సాధింపు చర్యలకు దిగిందని, అందులో భాగంగానే ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే తొలగించిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు టెక్ మహీంద్రా కంపెనీ ముందు ధర్నాకు దిగారు సాఫ్ట్వేర్ ఉద్యోగిని భావన. తన తండ్రి ఆరోగ్యం బాగోలేదని చెప్పి 3 రోజుల సెలవు కోరినప్పుడు, తనను ఏకపక్షంగా ఉద్యోగం నుండి తొలగించాంటూ వాపోయారు.
అనారోగ్యంతో కంపెనీలో కుప్ప కూలినప్పుడు యాజమాన్యం కనీసం పట్టించు కోలేదని సంచలన ఆరోపణలు చేశారు బాధితురాలు. తమ కంపెనీ యజమాని , మహీంద్ర గ్రూప్ కంపెనీల సంస్థ అధిపతి టెక్ మహీంద్రా ప్రతిరోజూ నీతి సూత్రాలు బోధిస్తారని, కానీ అవన్నీ చెప్పేందుకేనని , ఆచరణలో వ్యాపార దృక్పథం తప్ప మరోటి కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది బాధితురాలు భావన. 14 రోజుల పాటు చికిత్స తీసుకున్నా కూడా ఆ సమయంలో ఉద్యోగం నుండి తొలగిస్తామని బెదిరించారని పేర్కొంది .తనను ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగం నుండి తొలగించారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది భావన. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కంపెనీ ముందు ధర్నాకు దిగడంతో దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది.






