
బోరబండ యువకుల ఆధ్వర్యంలో డాక్టర్ గార్డ్ కంపెనీ
హైదరాబాద్ : ఉద్యోగాలు అడిగే స్థాయి నుంచి జాబ్స్ ఇచ్చే స్థాయికి యువత ఎదగాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లోని బోరబండకు చెందిన యువకులు డాక్టర్ గార్డ్ కంపెనీని ఏర్పాటు చేశారు. తనను స్పూర్తిగా తీసుకుని ఏర్పాటు చేసిన ఈ కంపెనీని సందర్శించాల్సిందిగా కోరడంతో బుధవారం కంపెనీని సందర్శించారు. వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్బంగా తెలంగాణ భవన్ వాటర్ ప్రూఫింగ్ పనులు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. యువతకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ యువకుల ప్రయత్నం మరింత మందికి స్ఫూర్తిని ఇస్తుందని, కంపెనీ విజయం సాధించాలని కోరారు. తొమ్మిది మంది యువకులు కలిసి ‘డాక్టర్ గార్డ్’ పేరుతో వాటర్ప్రూఫ్ సొల్యూషన్స్ కంపెనీని ప్రారంభించారు.
ఉద్యోగాలు అడగడం కాకుండా, పది మందికి ఉపాధి కల్పించాలన్న గొప్ప లక్ష్యంతో ఈ కంపెనీని ప్రారంభించడం అభినందనీయమన్నారు కేటీఆర్. జేఎన్టీయూ ప్రసంగంలో కేటీఆర్ చెప్పిన మాటల స్ఫూర్తితోనే కంపెనీని ఏర్పాటు చేసినట్లు ‘డాక్టర్ గార్డ్’ బృందం తెలిపింది. పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే అయినప్పటికీ, తమ కాళ్లపై తాము నిలబడాలనే లక్ష్యంతో కంపెనీని స్థాపించినట్లు తెలిపారు. ప్రస్తుతం తమ కంపెనీలో 30 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, రానున్న ఒక సంవత్సరంలోగానే ఈ సంఖ్యను వెయ్యికి పైగా తీసుకపోయే లక్ష్యంతో పని చేస్తున్నామని వారు కేటీఆర్కు వివరించారు. తమ వాటర్ప్రూఫ్ సొల్యూషన్స్లో ప్రస్తుతం ఉన్న పద్ధతులకు మరింత ఆధునికతను, టెక్నాలజీని జోడించి ముందుకు తీసుకు వచ్చినట్లు చెప్పారు.