తిరువనంతపురం : బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణం ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఊరటనిస్తూ తీర్పు చెప్పింది. ఇందులో దివంగత పీఎంకు ఎలాంటి ప్రమేయం లేదని తేల్చింది. ఇదిలా ఉండగా ఈ కేసుకు సంబంధించి ఇచ్చిన తీర్పు నేపథ్యంలో సీఎం సతీశన్ స్పందించారు. తక్షణమే మన్మోహణ్ సింగ్ కు బీజేపీ క్షమాపణ చెప్పాలని కేరళ ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. జూలై 29న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సింగ్ నిజాయితీపై ఎప్పుడూ ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేసిందని సతీశన్ పేర్కొన్నారు. ‘చరిత్ర డాక్టర్ మన్మోహన్ సింగ్ను తప్పక సానుకూల దృక్పథంతో గుర్తుంచు కుంటుంది’ అనే శీర్షికతో జాతీయ దినపత్రికలో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ రాసిన వ్యాసాన్ని ప్రస్తావిస్తూ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
తన పాలనా రికార్డును మరుగున పడేసేందుకు సింగ్పై ఏళ్ల తరబడి దుష్ప్రచార ఉద్యమం జరిగిందని సతీశన్ తన పోస్ట్లో పేర్కొన్నారు. భారతదేశానికి RTI చట్టం, MGNREGA, జాతీయ ఆహార భద్రతా చట్టం, అటవీ హక్కుల చట్టం , విద్యా హక్కు చట్టం వంటి వాటిని అందించిన పాలనా రికార్డును కప్పిపుచ్చడానికి ఒక కల్పిత కుంభకోణం, నిరంతర దుష్ప్రచారం (రాజ్యసభలో చేసిన ‘రెయిన్కోట్’ వ్యాఖ్యతో సహా) ఉపయోగించ బడ్డాయి అని ఆయన అన్నారు. ఈ గణతంత్ర దేశం చూసిన అత్యంత ప్రభావవంతమైన ప్రధాన మంత్రులలో ఒకరిగా, నిశ్శబ్ద , సౌమ్య స్వభావం గల వ్యక్తిగా చరిత్ర సింగ్ను గుర్తుంచు కుంటుందని ఆయన అన్నారు.





