హైదరాబాద్ : హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 18 నుండి KBR పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్ విధానం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. KBR పార్క్ చుట్టూ H-CITI ప్రాజెక్ట్ కింద ఫ్లైఓవర్లు , అండర్పాస్ల నిర్మాణం జరుగుతున్నందు వల్ల కేబీఆర్ పార్కు నుండి అక్కడ వన్-వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. నిర్మాణ పనుల కారణంగా, అందుబాటులో ఉన్న తక్కువ రోడ్డు స్థలంలోనే వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండటంతో ఉన్న రోడ్డుపై రెండు దిశల్లోనూ వాహనాలు నడపడం వల్ల తీవ్రమైన ట్రాఫిక్ జామ్, జాప్యం , ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్నారు.
రద్దీని తగ్గించడానికి, ట్రాఫిక్ ప్రవాహాన్ని మెరుగు పరచడానికి , ప్రయాణికుల భద్రతను నిర్ధారించడానికి KBR పార్క్ చుట్టూ వన్-వే విధానాన్ని అమలు చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ VC సజ్జనార్ తెలిపారు. ఈ విధానాన్ని శాశ్వతంగా అమలు చేసే ముందు, పోలీసులు దీని ఆచరణ సాధ్యత , నిర్వహణ అవసరాలను అంచనా వేయడానికి రెండుసార్లు ప్రయోగాత్మక పరిశీలనలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ట్రయల్స్ సమయంలో ట్రాఫిక్ ప్రవాహం, జంక్షన్ల పనితీరు, లేన్ క్రమశిక్షణ, రద్దీ ప్రాంతాలు, ప్రయాణికుల కదలికలను పర్యవేక్షించినట్లు తెలిపారు సీపీ. ఆ పరిశీలనల ఆధారంగా అవసరమైన మార్పులు చేసి, ఇప్పుడు ఆగస్టు 18 నుండి వన్-వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు .





