హైదరాబాద్ : ప్రజారోగ్యం మరియు ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని అనలాగ్ , నాన్-డైరీ (పాలేతర) పనీర్ తయారీ , అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది పాటు నిషేధం విధించింది. మార్కెట్లో కృత్రిమ, నాన్-డైరీ పనీర్ విక్రయాలు వెలుగులోకి రావడంతో ‘పనీర్’ పేరుతో అమ్ముడవుతున్న అనలాగ్ లేదా నాన్-డైరీ పనీర్ తయారీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ, పంపిణీ, రవాణా అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్త నిషేధం విధించింది. ప్రజారోగ్య కారణాలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ ఆహార భద్రతా కమిషనర్ ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006’లోని సెక్షన్ 30(2)(a) కింద ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ నిషేధం సెప్టెంబర్ 10 నుండి తక్షణమే అమల్లోకి వచ్చి ఏడాది పాటు కొనసాగుతుంది.
సెప్టెంబర్ 10 నాటి గెజిట్ నోటిఫికేషన్ నంబర్ 807 ద్వారా ఈ ఉత్తర్వు అధికారిక గెజిట్లో ప్రకటించ బడింది. పాలతో తయారు చేయనప్పటికీ పనీర్గా విక్రయించ బడుతున్న ఉత్పత్తుల వ్యవహారం ,ఆహార భద్రతకు సంబంధించిన ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధం అనలాగ్, కృత్రిమ, నాన్-డైరీ పనీర్ వంటి అన్ని రకాల ఉత్పత్తులకు వర్తిస్తుందని, తద్వారా తెలంగాణ అంతటా వీటి తయారీ, నిల్వ, రవాణా , అమ్మకాలు చట్టవిరుద్ధం అవుతాయని అధికారులు తెలిపారు.
పనీర్ను ఎక్కువగా ఉపయోగించే పాల ఉత్పత్తుల కేంద్రాలు, రెస్టారెంట్లు, హోటళ్లు, ఫుడ్ అవుట్లెట్లు , ఇతర సంస్థలపై నిఘాను మరింత కఠినతరం చేయాలని ఆహార భద్రతా శాఖ భావిస్తోంది. ఉత్తర్వులను ఉల్లంఘించినట్లు తేలితే తయారీదారులు, సరఫరాదారులు, విక్రేతలపై అధికారులు చర్యలు తీసుకోవచ్చు. సాంప్రదాయకంగా పనీర్ అనేది పాలతో తయారు చేసే ఉత్పత్తి కాగా, అనలాగ్ లేదా నాన్-డైరీ ఉత్పత్తులను వృక్ష సంబంధిత కొవ్వులు (vegetable fats), ప్రోటీన్లు లేదా ఇతర పదార్థాలను ఉపయోగించి తయారు చేస్తారు.





