హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై దాఖలైన కేసుకు సంబంధించి శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా తను ఒక పార్టీ గుర్తుపై పోటీ చేసి ఆ తర్వాత మరో పార్టీలో చేరడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. దీనిపై సుదీర్ఘ వాదనలు జరిగాయి కోర్టులో. ఎమ్మెల్యేగా ఆయన అనర్హుడని పేర్కొంది. రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడం అనే కారణంతో అనర్హతకు సంబంధించిన రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ (Tenth Schedule) లోని పేరా 2(1)(a) ప్రకారం, 2024 ఏప్రిల్ 23 నుండి దానం నాగేందర్ తెలంగాణ శాసనసభ సభ్యుడిగా అనర్హులయ్యారని కోర్టు ప్రకటించింది.
ఆయనపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని పక్కన పెడుతూ, తెలంగాణ హైకోర్టు ఈ సంచలన తీర్పును వెలువరించింది. తమ పార్టీ ఇచ్చిన బి ఫారంతో గెలిచిన ఎమ్మెల్యేలు అధికారం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం పూర్తిగా రాజ్యాంగ విరుద్దమని బీఆర్ఎస్ ప్రశ్నించింది. ఇదిలా ఉండగా దీనిపై ఇంకా వ్యాఖ్యానించ లేదు. ఎలాంటి స్పందన కనబర్చలేదు కోర్టు ఇచ్చిన తీర్పుపై దానం నాగేందర్. ప్రస్తుతం దానం ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2024లో కాంగ్రెస్లో చేరారు. 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో ఓటమి పాలయ్యారు. 2018లో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2023లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచారు. 2024లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేశారు. ఆయన జి. కిషన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.





