హైదరాబాద్ : ధర్మ సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విషారదన్ మహారాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు వంగా సందీప్ రెడ్డి వరంగల్ ఎయిర్ పోర్టుకు రుద్రమదేవి , కాకతీయ పేర్లు పెట్టాలని సూచించారు. దీనికి సీఎం స్పందిస్తూ స్వాగతించారు. ఈ తరుణంలో డాక్టర్ విషారదన్ మహారాజ్ స్పందించారు. వరంగల్ విమానాశ్రయానికి ‘సమ్మక్క-సారలమ్మ విమానాశ్రయం’ అని పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. వరంగల్ విమానాశ్రయానికి ఒక పేరును సూచించమని మీరు కోరారని తెలిపారు. దానికి స్పందనగా తాము మొదటి రోజు నుంచీ చెబుతున్నట్లుగానే మా ప్రతిపాదన ఇది అని పేర్కొన్నారు.
90 శాతం మంది బహుజనుల ఆరాధ్య దైవాలు, వీర వనితలు అయిన ‘సమ్మక్క-సారలమ్మ’ పేర్లను ఈ విమానాశ్రయానికి పెట్టాలని స్పష్టం చేశారు. మీరు ఈ పేరునే ఖరారు చేస్తారని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. మీరు ‘కాకతీయ’ లేదా ‘రుద్రమ’ వంటి పేర్లను పరిశీలిస్తున్నట్లు మాకు తెలిసింది. ఆ పేర్లు పెడితే, జనాభాలో 10 శాతం కూడా లేని పాలక వర్గాలకు లేదా అగ్రవర్ణాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుంది అని మండిపడ్డారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద యుద్ధ జాతరను నిర్వహించిన ప్రపంచ ప్రఖ్యాత వీర వనితలు సమ్మక్క-సారలమ్మల పేర్లను దీనికి పెట్టడం అత్యంత సముచితం అని పేర్కొన్నారు.
తెలంగాణలోని 4 కోట్ల మంది బహుజనుల తరపున, వరంగల్ విమానాశ్రయానికి ఈ పేర్లనే ఖరారు చేయాలని కోరుతున్నామన్నారు విశారదన్ మహారాజ్. ఒకవేళ మీరు సమ్మక్క-సారలమ్మ పేర్లను ఎంపిక చేయకపోతే, మీరు అణగారిన వర్గాలకు వ్యతిరేకమని అది నిస్సందేహంగా రుజువు చేస్తుందన్నారు.






