స్పష్టం చేసిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : రాజకీయాలలో గెలుపు ఓటములు అత్యంత సహజమని , కార్యకర్తలు, నేతలు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేసిందన్నారు. అంతే కాకుండా పోలీసుల జోక్యం, విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారని ఇవన్నీ ఎన్నికల ఫలితంపై ప్రభావం చూపించాయని పేర్కొన్నారు కేటీఆర్.
కాంగ్రెస్ హయాంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని, మార్కెట్లో డబ్బు లేక పోవడంతో పండుగల సమయంలో కూడా వ్యాపారం జరగట్లేదని ఆయన విమర్శించారు. కేసీఆర్ హయాంలో రియల్ ఎస్టేట్, పరిశ్రమలు అభివృద్ధి చెందాయని గుర్తు చేశారు.
ప్రజలు ‘ఆరు గ్యారెంటీలను 420 హామీలు’గా భావిస్తున్నారని, నిరుపేదలు తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రలోభాలకు గురయ్యారని అభిప్రాయపడ్డారు. రూ. 150 కోట్లు ఖర్చు పెట్టి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడు కోవడానికి ఈ ఎన్నికను గెలిచారని తీవ్ర ఆరోపణలు చేశారు కేటీఆర్. ప్రస్తుత ఫలితం ఓటమి కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రోడ్ల మీదకు తీసుకొచ్చామని తెలిపారు. రాబోయే రెండేళ్ల తర్వాత బలమైన ‘తుఫాను’ వస్తుందని, అప్పుడు కాంగ్రెస్ ఉనికి ఉండదని జోస్యం చెప్పారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండి, బూత్ కమిటీలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.





