నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. గురువారం మీడియాతో మాట్లాడారు. ఇవాళ రేవంత్ రెడ్డి తన నోటి నుంచి టిఎంసీల కొద్దీ అబద్దాలు, క్యూసెక్కుల కొద్దీ అజ్ఞానాన్ని పారించారని మండిపడ్డారు. నటనకు ఇచ్చినట్లు అబద్దాలకు కూడా ఆస్కార్ గనుక ఇస్తే అంతర్జాతీయంగా అందరూ ముక్తకంఠంతో రేవంత్ రెడ్డినే ఎంపిక చేస్తారని అన్నారు హరీశ్ రావు. బేసిన్ల పై బేసిక్ నాలెడ్జ్ లేదన్నది బహిరంగ సత్యం అన్నారు. ఇవాళ కొత్తగా తెలిసింది, ముఖ్యమంత్రికి బచావత్ ట్రిబ్యునల్ కు, బ్రిజేష్ ట్రిబ్యునల్ కు తేడా తెలియదని వెల్లడైందన్నారు మాజీ మంత్రి.దివంగత బచావత్ ఏ లోకంలో ఉన్నారో కానీ, ముఖ్యమంత్రిగా మీరు ప్రదర్శిస్తున్న అజ్ఞానాన్ని చూసి ఎంత మదన పడుతున్నారో నంటూ ఎద్దేవా చేశారు. .
నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించడం రేవంతు నైజం అంటూ ధ్వజమెత్తారు హరీశ్ రావు. సభకు వస్తే కేసీఆర్ ను అవమానించం అని ఒకవైపు చెబుతూనే అదే ప్రెస్ మీట్ లో కేసీఆర్ ని కసబ్ తో పోల్చుతావా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పోరాటాన్ని ఉరకలెత్తించి, నాలుగు కోట్ల ప్రజలను ఒక్కటి చేసి ప్రాణాలకు తెగించి నిరాహారదీక్ష చేసి నీ కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణను సాధించిన మహనీయుడిని అన్నారు. కానీ ఆయనను కసబ్ తో పోల్చిన నీకు సంస్కారం, మర్యాద అనే పదాలకు అర్థం కూడా తెలియదన్నారు. నీకు తెలిసిందళ్లా అనాగరికమైన భాష, అసభ్య పదజాలం, బూతు ప్రసంగం తప్ప మరోటి రాదన్నారు హరీశ్ రావు.






