ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజబాబు
అమరావతి : ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజబాబు సంచలనంగా మారారు. కొత్త సంవత్సరం సందర్బంగా తనను కలిసేందుకు వచ్చిన ప్రముఖులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలకు కీలక సూచనలు చేశారు. తనను కలిసేందుకు వచ్చిన వారు ఎవరూ దయచేసి పూల బోకేలు, ఖరీదైన బహుమతులు తీసుకు రావద్దంటూ సూచించారు. తాజాగా ఆయన చేసిన ప్రకటన కలకలం రేపింది.ఇక నుంచి పుష్ప గుచ్ఛాలు మానేయాలని, హాస్టల్ విద్యార్థులకు సహాయం చేయాలని కోరారు కలెక్టర్ రాజబాబు. 2026 నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని సీనియర్ అధికారులు కలిసేటప్పుడు పూల బొకేలు, దండలు, స్వీట్లు, శాలువాలు లేదా కేకులు తీసుకు రావద్దని, బదులుగా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులను అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
జిల్లా కలెక్టర్ పి. రాజబాబు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు . శ్రేయస్సు , ఆకాంక్షల నెరవేర్పును తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన సంవత్సరాన్ని కొత్త ఉత్సాహంతో , సానుకూల దృక్పథంతో స్వాగతించాలని ఆయన పౌరులను కోరారు . సందర్శకులు పుష్పగుచ్ఛాలు, డ్రై ఫ్రూట్స్, శాలువాలు, కేకులు తీసుకు రావడం మానుకోవాలని కలెక్టర్ అన్నారు. విరాళం ఇవ్వాలనుకునే వారు నోట్బుక్లు, పెన్నులు, పెన్సిళ్లు, స్కూల్ బ్యాగులు, దుప్పట్లు, దోమతెరలు, బెడ్షీట్లు, ఫ్యాన్లు, లైట్లు విరాళంగా ఇవ్వమని ప్రోత్సహించారు, ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తాయని స్పష్టం చేశారు.






