దావోస్ లో స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్
అమరావతి : ప్రపంచ ఆర్థిక సదస్సు -2026 స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ముగిసింది. ఏపీకి చెందిన సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన దిగ్గజ కంపెనీలు , ప్రతినిధులు, సీఈవోలు, మేనేజింగ్ డైరెక్టర్లు, చైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్బంగా నారా లోకేష్ టాప్ కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేకంగా చర్చించారు. తమ ఏపీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. కీలకమైన సంస్కరణలు తీసుకు వచ్చామని, పెట్టుబడిదారులకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఈ సందర్బంగా ఎలాంటి సబ్సిడీలు , వసతులు కావాలన్నా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
ఈ సందర్బంగా లక్షల కోట్ల ఆస్తులు కలిగిన ప్రముఖ కంపెనీ బ్లాక్ స్టోన్ చీఫ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు నారా లోకేష్. ముఖ్యంగా రాజధాని అమరావతిలో పెరుగుతున్న పట్టణీకరణను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ స్థాయి రిటైల్ మాల్స్, బహుళ వినియోగ వాణిజ్య సముదాయాల ఏర్పాటును పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి లోకేష్ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించారు బ్లాక్ స్టోన్ చీఫ్ స్టీఫెన్ స్క్వార్జ్మాన్. తాము ఇప్పటికే నవీ ముంబైలో సుమారు రూ. 20,000 కోట్లతో భారీ డేటా సెంటర్ క్యాంపస్ను నిర్మిస్తున్నామని తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను కూడా సీరియస్గా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
బ్లాక్ స్టోన్ వంటి గ్లోబల్ ఇన్వెస్టర్ ఏపీలో అడుగుపెడితే, అది కేవలం వేల కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు (FDI) తీసుకురావడమే కాకుండా, రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉన్నత స్థాయి ఉద్యోగాల సృష్టికి , అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర విశ్వసనీయత పెరగడానికి దోహద పడుతుంది. ఈ భేటీ ఏపీని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ మ్యాప్లో మరోసారి హైలైట్ చేస్తూ, పారిశ్రామికాభివృద్ధికి కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.






