మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశం మొత్తం బీజేపీ అధికారంలోకి వచ్చినా తెలంగాణలో మాత్రం ఎప్పటికీ రానే రాదన్నారు. నిజామాబాద్ జిల్లాలో ధర్మపురి అరవింద్ మళ్లీ గెలవడంటూ జోష్యం చెప్పారు. జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనాపరంగా పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. దీంతో అన్ని వర్గాల ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారని, అయినా సోయి లేకుండా పోయిందంటూ సీఎంను ఉద్దేశించి పేర్కొన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటామన్నారు. ఇక త్వరలో రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ దే హవా కొనసాగడం ఖాయమన్నారు జీవన్ రెడ్డి.
విచిత్రం ఏమిటంటే తమ ప్రభుత్వ హయంలో చేసిన పనులను కాంగ్రెస్, బీజేపీ వాళ్లు ప్రారంభిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలు ఒక్కటేనని ప్రజలకు అర్థమై పోయిందన్నారు మాజీ ఎమ్మెల్యే. జిల్లాలో సుదర్శన్ రెడ్డి, రాకేష్ రెడ్డి, అరవింద్ అందరూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు జీవన్ రెడ్డి. ఇప్పుడు తాము ఎక్కడికెళ్లినా మళ్ళీ కెసిఆర్ సారే రావాలని అంటున్నారని చెప్పారు. ఈ విషయం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి, నేతలకు, సీఎంకు అర్థమైందన్నారు.






