కాంగ్రెస్ సర్కార్ పై మాజీ మంత్రి ఆగ్రహం
హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల యాక్షన్ ప్లాన్ కేవలం ఉత్తి దండగ అన్నారు. అంతే కాదు ప్రచార పర్వం తప్ప మరొకటి కాదంటూ ఎద్దేవా చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. 800 రోజుల పాలనలో చేసిందేం లేక, 99 రోజు ప్రణాళిక పేరిట మరో డ్రామాకు తెరతీశారంటూ మండిపడ్డారు. రెండున్నరేండ్ల పాలన తర్వాత ప్రగతి ప్రణాళికలు గుర్తుకు వచ్చాయా అంటూ ఎద్దేవా చేశారు. అమలుకు నోచుకోని ఆరు గ్యారెంటీలు, పాలన వైఫల్యాలు, కోట్లు కొల్లగొట్టేందుకు చేసిన స్కాంలు, ప్రజల ఛీత్కారాల నుంచి దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మరో డైవర్షన్ ప్లాన్ ఇది అని ఆరోపించారు హరీశ్ రావు.
గతంలో రెండుసార్లు నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభల్లో ప్రజల నుంచి తీసుకున్న లక్షలాది దరఖాస్తులు పరిష్కారం కాక ఇంకా చెత్తబుట్టల్లోనే మగ్గుతున్నాయని మండిపడ్డారు. ముందు దీని గురించి చెప్పాలన్నారు. ఆ దరఖాస్తులకు దిక్కు లేదు కానీ, మళ్లీ ఇప్పుడు పది వారాల పాటు పది రకాల నాటకాలతో ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దం కావడం సిగ్గు చేటు అన్నారు హరీశ్ రావు. రెండున్నరేండ్లలో అసలు ఏం చేసారని ప్రచారం నిర్వహిస్తున్నారు రేవంత్ రెడ్డి? గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి మీ పైఫల్యాలు ప్రచారం చెప్పుకుంటారా అని నిలదీశారు.





