లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ గురుమూర్తి
న్యూఢిల్లీ : వైఎస్సార్సీపీ ఎంపీ మద్దెల గురుమూర్తి లోక్ సభలో ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో ప్రధానంగా తన తిరుపతి లోక్ సభ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ప్రస్తావించారు. ఇదే సమయంలో అక్రమ చొరబాటుదారుల విషయంలో ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. పులికాట్ ముఖ్య ద్వారాల పూడికతీత, మత్స్యకారుల చొరబాట్ల నిరోధంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిపై ఎంపీ గురుమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న అక్రమ చొరబాట్లు, దాడులు, మత్స్యకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ అంశాలను తక్కువగా అంచనా వేయడం ఆందోళనకరమన్నారు ఎంపీ గురుమూర్తి . ప్రాంతీయ మత్స్యకార నిర్వహణ మండళ్ల ఏర్పాటు సరిపోదని, తక్షణమే సంయుక్త తీర గస్తీ, కఠిన నిబంధనల అమలు, అక్రమ యాంత్రిక పడవల స్వాధీనం వంటి కఠిన చర్యలు తీసుకోకపోతే సమస్య మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు. పులికాట్ సరస్సు , తీరప్రాంతాల్లో మత్స్యకారుల భద్రతకు కేంద్రం ప్రత్యక్ష బాధ్యత తీసుకుని, శాశ్వత అంతర్రాష్ట్ర సమన్వయ వ్యవస్థను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.






