చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్
హైదరాబాద్ : ప్రోటోకాల్ ను పాటించడం లేదని, ఒంటెద్దు పోకడ పోతున్నాడని, తానే సుప్రీం అని ఫీల్ అవుతున్నాడని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ లోని కూకట్ పల్లి నల్లచెరువు శిలాఫలకంపై కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన బండి రమేష్ పేరు పెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వారంలోగా శిలాఫలకం మార్చాలన్నారు.
లేదంటే నేనే వెళ్లి కూల్చేస్తా అని ఆగ్రహం వ్యక్తం చేశారు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఎన్నిసార్లు చెప్పినా, చివరకు హైకోర్టు చీవాట్లు పెట్టినా తనకు బుద్ది రావడం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ నేతల ఫిర్యాదుపై స్పందించారు స్పీకర్ . దీంతో హైడ్రా కమిషనర్కు ఫోన్ చేశారు గడ్డం ప్రసాద్ కుమార్. నల్లచెరువు ప్రోటోకాల్ ఉల్లంఘనపై రంగనాథ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, వాణి దేవి, స్థానిక ఎమ్మెల్యే పేర్లతో శిలాఫలకం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.





