తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్
హైదరాబాద్ : తెలంగాణ ఇంటెలక్చువల్ ఫోరం నేత డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు ఏం పని అంటూ ప్రశ్నించారు. ప్రతి శని, ఆదివారం హైదరాబాద్ కు ఎందుకు వస్తున్నారంటూ నిలదీశారు. మీరు రావడం వల్ల ఇక్కడ ఇబ్బంది ఏర్పడుతోందన్నారు. మీకెందుకు తెలంగాణ పోలీసులు సెక్యూరిటీ ఇవ్వాలని ఫైర్ అయ్యారు. డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. మీకు పనీ పాట ఏమీ లేదా అని భగ్గుమన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన నల్లమల బిడ్డ, సీనియర్ జర్నలిస్టు కె. వెంకట్రామి రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడం, ఆపై విచక్షణా రహితంగా దాడి చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలుకు తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా..? మీకు ఎంత ధైర్యం అని నిప్పులు చెరిగారు డాక్టర్ పృథ్వీ రాజ్ యాదవ్. ఇదే పాలమూరు జిల్లాకు చెందిన రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ జర్నలిస్ట్ను కాపాడలేక పోవడం దారుణమన్నారు. ఇంకోసారి ఎవరైనా తమ బిడ్డలను ముట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.






