సంచలన వ్యాఖ్యలు చేసిన పరకాల ప్రభాకర్
హైదరాబాద్ : ఏపీకి చెందిన ప్రముఖ మేధావి, రాజకీయ అనలిస్ట్ , రచయిత పరకాల ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన గత కొంత కాలంగా మోదీ సర్కార్ ను , అది చేస్తున్న అప్రజాస్వామిక పనుల గురించి ఏకరువు పెడుతూ వస్తున్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు చెబుతున్నారు. ఆపై ప్రజలను చైతన్యవంతం చేస్తూ వస్తున్నారు. ఈ సందర్బంగా సమావేశాలు, వరుస సెమినార్లతో బిజీగా ఉన్నారు. తాజాగా జాతీయ మీడియా ట్రైబ్ తో జరిగిన చిట్ చాట్ సందర్బంగా సంచలన ఆరోపణలు చేశారు పరకాల ప్రభాకర్.
భారత దేశంలో 2024లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ పార్టీలతో కూడిన ఎన్డీయే ఓట్ల చోరీకి పాల్పడిందని ఆరోపించారు. అందువల్లనే దేశంలో తిరిగి మరోసారి అధికారంలోకి వచ్చిందన్నారు. నిస్సిగ్గుగా కేంద్ర ఎన్నికల సంఘం మోదీకి, అమిత్ షా పరివారానికి మేలు చేకూర్చేలా చేసిందని మండిపడ్డారు పరకాల ప్రభాకర్. ఓటు చోరీ గనుక జరగక పోయి ఉంటే.. 316 సీట్లతో INDIA కూటమి అధికారంలోకి వచ్చి ఉండేదని చెప్పారు. NDA కూటమి కేవలం 213 సీట్లకే పరిమితమై.. ప్రతిపక్ష హోదాలో ఉండేదన్నారు. కానీ.. ఓటు చోరీతో NDA అదనంగా 79 సీట్లను సొంతం చేసుకొని, అధికారంలోకి వచ్చిందన్నారు.






