కీలక ప్రకటన చేసిన మాజీ చీఫ్ కె అన్నామలై
చెన్నై : తమిళనాడు రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ కె అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా తనకు పార్టీ పరంగా ప్రకటించిన తొలి అభ్యర్థుల జాబితాలో తన పేరు లేక పోవడం పట్ల స్పందించాడు. ఈ మేరకు స్పందిస్తూ తనకు టికెట్ ఇవ్వాలని కోరలేదన్నాడు. తాను బీజేపీ హైకమాండ్ కు ఇదే విషయాన్ని వెల్లడించడం జరిగిందన్నారు. తాను ఏ నియోజకవర్గం నుంచీ పోటీ చేయనని కోర్ కమిటీకి ఇప్పటికే లిఖిత పూర్వకంగా తెలియ చేసినట్లు తెలిపారు కె. అన్నామలై.
అయితే తనకు కావాలని టికెట్ ఇవ్వలేదంటూ కొందరు దుష్ప్రచారం చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ చీఫ్. ఇప్పటికే తనకు ఏ పదవి ఇవ్వవద్దని కోరానని ఇక టికెట్ ఇచ్చే ప్రసక్తి ఉండదన్నారు. కాబట్టి, నాకు టికెట్ నిరాకరించారన్నది నిజం కాదన్నారు. వాస్తవం ఏమిటంటే, నేనే పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు. ఈ విషయం మీడియాలో చర్చనీయాంశంగా మారినందున, నేను ఇక్కడ దీనిపై స్పష్టత ఇస్తున్నానని తెలిపారు. నా నిర్ణయాన్ని గౌరవించి ఎన్డీయే కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసే అవకాశాన్ని కల్పించినందుకు బీజేపీ నాయకత్వానికి నేను కృతజ్ఞతలు తెలియ జేస్తున్నానని అన్నారు.






