కీలక ప్రకటన చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇందులో భాగంగా నెదర్లాండ్స్లో ఆ కిలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతోందని వెల్లడించారు.
ఇప్పటికే ఆలయ నిర్మాణం కోసం 33.5 ఎకరాల భూమిని నెదర్లాండ్ ప్రభుత్వం విశ్వ హిందూ పరిషత్కు అందజేసిందని చెప్పారు బీఆర్ నాయుడు. ఆ భూమిలో 250 కోట్ల రూపాయలతో నెదర్లాండ్స్లో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టాలని వీహెచ్ పీ నిర్ణయించిందని తెలిపారు చైర్మన్.
ఇందుకోసం టీటీడీ సహకారం కోరిందన్నారు. గోపురాలు, ప్రాకారాలతోపాటు శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా ఆలయాన్ని నిర్మించనున్న నేపథ్యంలో టీటీడీ నుంచి స్థపతి సహకారం అందించాలని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు అశోక్ కుమార్ కోరారని వెల్లడించారు బీఆర్ నాయుడు. ఈ విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని తెలియ చేసినట్లు పేర్కొన్నారు. యావత్ ప్రపంచమంతా గోవింద, శ్రీవారి నామాలు వినిపించాలన్నదే సీఎం ముఖ్య ఉద్దేశమన్నారు.







