దర్శకుడు విఘ్నేష్ శివన్ కామెంట్స్
హైదరాబాద్ : దర్శకుడు విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్ కష్టకాలంలో సంగీత దర్శకుడు అనిరుధ్ చేసిన సాయాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమా షూటింగ్ కోసం పాండిచ్చేరి వెళ్లే సమయంలో తన దగ్గర కేవలం బస్సు ఛార్జీల కోసం రూ. 250 మాత్రమే ఉన్నాయని తెలిపారు. అయితే, అనిరుధ్ రవిచంద్రన్ తన బ్యాగులో రహస్యంగా రూ. 50,000 ఉంచి, బస్సులో ఉండగా మెసేజ్ చేశారని విఘ్నేష్ పేర్కొన్నారు. ఆ మెసేజ్ చూసి బస్సులో తన కళ్లు చెమర్చాయని చెప్పుకొచ్చారు.
తాజాగా విఘ్నేష్ శివన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా విఘ్నేష్ శివన్ తమిళ సినీ పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన దర్శకుడు. రచయిత, నిర్మాత, లిరిసిస్ట్ (పాటల రచయిత). ఆయన తమిళ సినిమాల్లో ప్రేమకథలు, కామెడీ శైలిలో సినిమాలు రూపొందించి మంచి పేరు సంపాదించారు. విఘ్నేష్ శివన్ మొదట చిన్న సినిమాలు, మ్యూజిక్ వీడియోలతో కెరీర్ ప్రారంభించాడు. తర్వాత సినీ దర్శకుడిగా అవకాశాలు పొందాడు. తను 2012లో పొందా పోడి సినిమాకు తొలి సారిగా దర్శకత్వం వహించాడు.







