ఏపీని పర్యాటక కేంద్రంగా మారుస్తామని ప్రకటన
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఏపీని టూరిజం హబ్ గా మారుస్తామన్నారు. ప్రతీ వ్యక్తికి సంక్షేమం, అభివృద్ది ఎలా అందుతోంది, అధికారులు ప్రజలతో ఎలా వ్యవహరిస్తున్నారో సమాచారం తెప్పిస్తున్నాం అన్నారు సీఎం. ప్రజలకు సేవకులుగా పని చేస్తున్నాం. కుల, మత, ప్రాంతాల వారీగా రాజకీయాలు చేస్తే అభివృద్ధి ఉండదు. గత ఐదేళ్లూ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, బీచ్ టూరిజానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు.. బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ను మరో గోవాగా తయారు చేస్తాం అని ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు.
ఈ ప్రాంతంలో టూరిజాన్ని ప్రోత్సహించడం వల్ల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు. ఇక్కడి ప్రజల ఆదాయం పెంచడంతో పాటు జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు సీఎం. సముద్రపు నాచు సీవీడ్ ద్వారా మత్స్యకారులు స్థానికులకు అదనపు ఆదాయం వస్తుందన్నారు. మత్స్యకారుల జీవనోపాధికి నష్టం రాకూడదని అన్నారు. మన సముద్ర జలాలపై మత్స్యకారులదే హక్కు అని స్పష్టం చేశారు. ఇతర ప్రాంతాల జాలర్లు వస్తే ఉపేక్షించేంది లేదన్నారు. గత ప్రభుత్వంలో 217 జీవో ద్వారా స్థానిక నీటి వనరుల్లో చేపల పెంపకానికి మత్స్యకారులను దూరం చేశారని వాపోయారు. . మేం అధికారంలోకి వచ్చాక దానిని రద్దు చేసి మత్స్యకారుల జీవనానికి సహకరించాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.





