వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మాదే అధికారం
ఖానాపూర్ : తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గాలి వీస్తోందని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు. ఖానాపూర్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ అద్భుత విజయం సాధించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వీస్తున్న రాజకీయ మార్పు పవనాలకు, ప్రజల ఆకాంక్షలకు స్పష్టమైన నిదర్శనం ఈ గెలుపు అని పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలను కళ్లారా చూసిన ప్రజానీకం, రాష్ట్రంలో అభివృద్ధి ఆధారిత ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ ఏర్పాటుకు కృత నిశ్చయంతో ఉన్నారన్నారు.
డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల్లో లేనిపోని అపోహలు, భయాలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు బీజేపీ చీఫ్ . దశాబ్దాల పాటు చట్టసభల్లో పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకు రావడంలో విఫలమైన కాంగ్రెస్.. షాబానో కేసులో సుప్రీంకోర్టు తీర్పును తుంగలో తొక్కి ముస్లిం మహిళల హక్కులను, ఆత్మగౌరవాన్ని కాలరాసిందని ఆరోపించారు. మహిళా సాధికారత పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో భవిష్యత్ అంతా బీజేపీదే అని పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.






