తెలంగాణపై అడుగడుగునా అవమానం
హైదరాబాద్ : స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బారతీయ జనతా పార్టీని ఏకి పారేశారు. ఆ పార్టీ నేతలు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదన్నారు. వారికి తెలంగాణ రాష్ట్రం రావడం ఇష్టం లేదన్నారు. మతం పేరుతో, కులం పేరుతో రాజకీయాలు చేసే వారికి ఈ ప్రాంతపు ఆత్మ గౌరవం ఎలా అర్థం అవుతుందని ప్రశ్నించారు. చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
పార్లమెంట్ సాక్షిగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్రం విభజన గురించి ప్రస్తావించడాన్ని తప్పు పట్టారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికని పేర్కొన్నారు. తమ స్వలాభం కోసం చిల్లర మాటలు మాట్లాడే వారిని తెలంగాణ సమాజం సహించదని హెచ్చరించారు. బీజేపీ తెలంగాణ ఏర్పాటును అడుగడుగునా అవమానిస్తూ వస్తోందని ఆరోపించారు. మహిళా బిల్లుకు డిలీమిటేషన్ బిల్లును లింక్ చేసి పాస్ చేయించు కోవాలని బీజేపీ పన్నిన కుట్ర బట్ట బయలు అయ్యిందన్నారు. ఏ విషయంలో నైనా బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే పని చేస్తుందని వెల్లడైందన్నారు కడియం శ్రీహరి.





