కోయంబత్తూరు, హోసూరు, తళ్లి, అవడి, మధురైలలో
తమిళనాడు : ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమిళనాడుకు బయలుదేరి వెళ్లారు. ఈ నెల 20, 21 తేదీల్లో తమిళనాడులోని కోయంబత్తూరు, హోసూరు, తళ్లి, ఆవడి, మధురైలలో ఎన్డీఏ పక్షాల అభ్యర్ధుల తరపున సీఎం ప్రచారం నిర్వహించేందుకు రెడీ అయ్యారు. ఇవాళ అమరావతి నుంచి కోయంబత్తూరు బయల్దేరి వెళ్లారు సీఎం. మధ్యాహ్నం 1 గంటకు కోయంబత్తూరులో నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం హోసూరు నుంచి తళ్లి చేరుకుని సాయంత్రం 4.45 గంటలకు ప్రచార ర్యాలీకి హాజరవుతారు.
రాత్రికి చెన్నై చేరుకుని ఆవడిలో జరుగనున్న రోడ్ షోలో పాల్గొని ఎన్డీఏ అభ్యర్ధుల తరపున ప్రచారం చేయనున్నారు. రేపు రాత్రికి అక్కడే బస చేయనున్న సీఎం చంద్రబాబు… 21వ తేదీ ఉదయం చెన్నై నుంచి బయల్దేరి మధురై చేరుకోనున్నారు. మధురై సమీపంలోని సాత్తూర్ లో మధ్యాహ్నం 1 గంటకు వివిధ సామాజిక వర్గాల నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం 3 గంటలకు సాత్తూర్ లోనే ఎన్డీఏ అభ్యర్ధి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. సాయంత్రం 5.15 గంటలకు మధురై నుంచి హైదరాబాద్ కు వెళ్తారు.





