ఎన్నో విషయాలు నేర్చుకున్నామన్న అనిత
సింగపూర్ : సింగపూర్లో ఏడు రోజుల పాటు కొనసాగిన ఏపీ మంత్రుల శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. డిజిటల్ గవర్నెన్స్, స్మార్ట్ సిటీ మౌలిక సదుపాయాల కల్పనపై జరిగిన ఈ అధ్యయన యాత్ర ఎంతో ఫలప్రదంగా సాగింది. ‘డిజిటల్ టు ది కోర్, అండ్ సర్వ్స్ విత్ హార్ట్’ స్ఫూర్తితో సింగపూర్ ప్రభుత్వం అందిస్తున్న ‘సింగ్పాస్’ (Singpass), ‘హెల్త్హబ్’ (HealthHub) వంటి అత్యాధునిక డిజిటల్ సేవలను సహచర మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, సత్య కుమార్ యాదవ్ , అనగాని సత్యప్రసాద్ లతో కలిసి రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా GovTech నిపుణులు టాన్ ఎంగ్ ఫెంగ్ కి కృతజ్ఞతలు తెలుపుతూ, ఆయనను సత్కరించడం జరిగిందని చెప్పారు మంత్రి. సీఎం నారా చంద్రబాబు నాయుడు ‘స్వర్ణాంధ్ర – 2047’ విజన్లో భాగంగా, సింగపూర్ తరహాలో పారదర్శకమైన, సురక్షితమైన డిజిటల్ పాలనను రాష్ట్రంలో అమలు చేసి, ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా ఈ శిక్షణను పూర్తి చేసుకున్నామని తెలిపారు. 39 ఏళ్ల అపార అనుభవం గల టెక్నాలజీ నిపుణులు టాన్ ఎంగ్ ఫెంగ్ వారి అనుభవాలను పంచుకున్నారని పేర్కొన్నారు.





